తరుణ్ హైదరాబాద్: తెలుగు హీరో తరుణ్ పై నిర్మాత నట్టి కుమార్ యాక్టర్ సంఘంలో కేసు వేసారు. ప్రస్తుతం నట్టికుమార్ నిర్మాణంలో రూపొందుతున్న ‘యుద్ధం' చిత్రంలో నటిస్తున్న తరుణ్ సినిమా షూటింగు కంటే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆడేందుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండటం, సిసిఎల్ టోర్నీ పూర్తయ్యే వరకు సినిమా షూటింగుకు రాను అని మోరాయిస్తుండటంతో నట్టి కుమార్ ఈ కేసు వేయాల్సి వచ్చింది. ‘యుద్ధం' సినిమా షూటింగ్ మరో ఐదు రోజులు బ్యాంకాక్ లో చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తయింది. అయితే సీసీఎల్ టోర్నీ కారణంగా తాను ఇప్పుడు డేట్స్ ఇవ్వలేనని తరుణ్ తెగేసి చెప్పాడట. ఇలా అయితే తాను నష్ట పోతానని నట్టి కుమార్ యాక్టర్ సంఘాన్ని ఆశ్రయించాడు. తరుణ్ తీరుపై నిర్మాతల మండలిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుటుంది, ఇండస్ట్రీ బాగుంటేనే హీరోలు బాగుంటారు. కానీ ఆవిషయాన్ని తరుణ్ గ్రహించకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని మండి పడుతున్నారు. రామ్ చరణ్, ప్రిన్స్ లాంటి హీరోలు సిసిఎల్ టోర్నీలో అడుతున్నప్పటికీ వారు షూటింగులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. చరణ్ జంజీర్ షూటింగ్ కోసం, ప్రిన్స్ తను చేస్తున్న మరో సినిమా కోసం సీసీఎల్ టోర్నీకి బ్రేక్ ఇచ్చారు. వీరిని చూసి తరుణ్ లాంటి హీరోలు నేర్చుకోవాలని పలువురు నిర్మాతలు సూచిస్తున్నారు. ‘యుద్ధం' సినిమా వివరాల్లోకి వెళితే... శ్రీహరి, తరుణ్, యామి కాంబినేషన్లో రూపొందుతోంది ఈ చిత్రం. భారతీ గణేశ్ దర్శకత్వం వహిస్తుండగా, విశాఖ టాకీస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నట్టి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోందని నిర్మాత నట్టి కుమార్ చెప్పారు. ఈ సినిమాలో ఇంకా బ్రహ్మానందం, ప్రగతి, గౌతంరాజులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: జస్వంత్, కూర్పు: గౌతంరాజు, సహ నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ.
Post a Comment